కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటి) ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో నెలకొల్పిన మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్ పురోగతిని పరిశీలించారు. కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ సీఈవో, చైర్మన్ సిడ్నీ ల్యూ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి తో మాట్లాడారు. తమ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిని చర్చించారు. కొన్ని కార్యాచరణ సమస్యలను ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. వాటిని వీలైనంత వేగంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి అక్కడికక్కడే తన వెంట ఉన్న అధికారులను ఆదేశించారు.

కంపెనీకి ప్రభుత్వం తరఫున అందించాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించటంతో పాటు ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఫాక్స్‌కాన్ కార్యకలాపాలు.. మరియు భవిష్యత్ ప్రణాళికల కు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు.

తెలంగాణలో ఎఫ్‌ఐటి మరిన్ని పెట్టుబడులకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కంపెనీ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. మ్యానుఫాక్షరింగ్ రంగంలో పాటు కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని వివరించారు.

ముఖ్యమంత్రి ఫాక్స్కాన్ సందర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే సాంకేతిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు అద్దం పట్టింది.

Spread the love