14న భూ భార‌తి ప్రారంభోత్స‌వం.

* పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు.

* ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు.

* ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం.

* ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి.

హైద‌రాబాద్‌: భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భార‌తిని సోమ‌వారం ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ప్రజలకు, రైతులకు భూ భార‌తిపై అవ‌గాహ‌న కల్పించాల‌ని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేయాలన్నారు.

అనంత‌రం రాష్ట్రంలోని ప్ర‌తి మండ‌లంలోనూ క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌జలు, రైతుల‌కు అర్ధ‌మ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్ట‌ల్ ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్ట‌ల్ బ‌లోపేతానికి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌, సీసీఎల్ఏ కార్య‌ద‌ర్శి మ‌క‌రంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అత్యంత నిరుపేద‌లు.. అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి.

ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక‌.

అర్హుల జాబితాను మండ‌ల అధికారుల బృందం త‌నిఖీ చేయాలి.

ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

గ్రామ స్థాయిలో ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఇందిర‌మ్మ క‌మిటీలు జాగ్ర‌త్త వ‌హించాల‌ని.. అర్హుల‌నే ఎంపిక చేయాల‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ క‌మిటీ త‌యారు చేసిన జాబితాను మండ‌ల అధికారుల‌తో కూడిన (త‌హ‌శీల్దార్‌, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి త‌నిఖీ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవ‌రైనా అన‌ర్హుల‌కు ఇల్లు ద‌క్కిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌మే దానిని ఇందిర‌మ్మ క‌మిటీకి తెలియ‌జేసి ఆ స్థానంలో మ‌రో అర్హునికి ఇల్లు మంజూరు చేయాల‌న్నారు.

ఇందిర‌మ్మ ఇళ్ల పేరుతో ఎవ‌రైనా దందాలు చేస్తున్న‌ట్లు తెలిస్తే వెంట‌నే కేసులు న‌మోదు చేయాల‌న్నారు. అన‌ర్హులు ఎవ‌రైనా ఇల్లు ద‌క్కించుకొని నిర్మించుకుంటే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం పాటు వారు పొందిన మొత్తాన్ని వ‌సూలు చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇంటి ల‌బ్ధిదారుకు మంజూరైన ఇంటికి అత‌ని సౌల‌భ్యం ఆధారంగా అద‌నంగా 50 శాతం మేర నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం అన్నారు. ల‌బ్ధిదారుకు ఆర్థిక‌ప‌ర‌మైన ఊర‌ట ల‌భించేందుకుగానూ సిమెంట్‌, స్టీల్ త‌క్కువ ధ‌ర‌ల‌కు అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ‌నిర్మాణ‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, గృహ నిర్మాణ‌ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Spread the love