పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత.
భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది.
జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు.
వంట గదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత.
(1937 – 2024).
*అనారోగ్యంతో ముంబై, బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస..*
టాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింప జేసిన సమర్థ వ్యాపారవేత్త.. దాతృత్వంలో మేటి.
భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపప్రథకు ‘ఇండికా’ కారు తయారీతో అడ్డుకట్ట.
నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, లాండ్ రోవర్ లను కొని లాభాల బాట లోకి నడిపించిన నాయకుడు.
స్వతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది.
విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది.
సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వ రూపం తనువు చాలించింది.
సంపదను సృష్టిస్తూనే.. ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది.
ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు.
ఎన్నటికీ చెరగని తన ఇంటి పేరును ఈ దేశానికి వదిలేసి… తాను మాత్రం వెళ్లిపోయారు..!
ముంబై: భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది..! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంట గదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాల పాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలి రాని లోకాలకు తరలి పోయారు..! రక్త పోటు స్థాయులు అకస్మాత్తుగా పడి పోవడంతో మూడు రోజుల క్రితం ముంబై లోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడు రోజులకే ఆయన కన్ను మూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడి పోవడంతో, రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్ బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంత కాలం చదివిన అనంతరం.. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికా లోని రివర్ డేల్ కంట్రీ హైస్కూల్లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్ టాటా.. 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ విశ్వ విద్యాలయ చరిత్ర లోనే అతి పెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపు లోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పని చేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలకా్ట్రనిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థి లాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండే వారు. ఈ క్రమం లోనే 1975లో అమెరికా లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. 1991లో జేఆర్డీ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యే దాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాం లోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థలను అగ్ర శ్రేణి సంస్థలుగా తీర్చి దిద్దారు. టీసీఎస్ ను.. దేశంలో వెయ్యి కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్త గానే కాదు.. తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచి పోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మ భూషణ్తో, 2008లో పద్మ విభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు.
*బహుముఖ విస్తరణ..*
రతన్ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ, విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కారు ద్వారా రతన్ టాటా లక్ష రూపాయలకే మిడిల్ క్లాసుకు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం ద్వారా, టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చి దిద్దారు. బ్రిటన్కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కొనుగోలు రతన్ టాటా హయాం లోనే జరిగింది. టాటా స్టీల్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు, బ్రిటిష్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి, టాటా స్టీల్ కంపెనీ కార్య కలాపాలను యూరప్ కూ విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు.
*సైరస్ మిస్త్రీతో వైరం..*
తన తర్వాత టాటా గ్రూప్ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ, వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుది బండలా మారిన ‘నానో’ కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్ టాటా అడుగడుగునా అడ్డు తగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆప కూడదని రతన్ పట్టు బట్టడం వల్లే, మిస్త్రీ టాటా గ్రూప్కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం వెనక రతన్ టాటా మద్దతు ఉంది.
*50కి పైగా స్టార్టప్ లలో పెట్టుబడులు..*
రతన్ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండే వారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్నాప్ డీల్, లెన్స్ కార్ట్ సహా 50కి పైగా స్టార్టప్ ల్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే..!
*ఎయిరిండియా కొనుగోలు..*
టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టు లోకి తేవాలన్నది రతన్ టాటా చిరకాల వాంఛ.. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, మలేషియా ఎయిర్ లైన్స్తో కలిసి విమానయాన రంగం లోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ పట్టు లోకి తేవాలనే ఏకైక లక్ష్యం తోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇపుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది.
*రతన్ టాటా విఫల ప్రేమ గాథ..!*
వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటా కూడా ఎంతో మందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది.
రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికా లోని లాస్ ఏంజెల్స్లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడి పోవాలని నిర్ణయించు కున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కానీ, భారత్- చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించ లేదు. దీంతో వారి ప్రేమ కథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలి పోయింది. తన ప్రేమ కథను పలుమార్లు బయట పెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్ర సీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్కు రతన్ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లి పీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మ బ్రహ్మచారి గానే ఉండి పోయారు.
*టాటా వారసులెవరు..?*
రతన్ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలున్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయెల్ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా. గ్రూప్ రిటైల్ వర్తక విభాగమైన ట్రెంట్తో పాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయెల్ సంతానమైన మాయ, నెవిల్లే, లేహ్ టాటా సైతం పలు టాటా కంపెనీల్లో మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
*మధ్య తరగతి కారు కల నానో..*
కారులో ప్రయాణించాలనే భారతీయ మధ్య తరగతి కుటుంబాల కల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే ‘నానో’ కారు రూపకల్పనకు దారి తీసింది. ఈ కారును 2008లో మార్కెట్ లోకి తెచ్చారు. కేవలం రూ. 1,00,000 ధరే నిర్ణయించి ప్రపంచం లోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా అప్పటికి ధనిక వర్గాలకే పరిమితం అయిన కారును మధ్య తరగతి ప్రజలకూ అందుబాటు లోకి తెచ్చి వారి కల నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్నా.. ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారు చేయడం కాకుండా మధ్య తరగతి, దిగువ వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని వాహనాలను తయారు చేయాలన్న చర్చకు దారి తీసింది. ఈ విషయంలో రతన్ టాటా విజన్ స్పష్టంగా ఉంది.. అదేమిటంటే మధ్య తరగతి స్థోమతకు తగ్గ కారును వారి ముందుంచడం. ‘నానో’తో ఆయన అది పూర్తి చేశారు.
ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు.
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముంబైలో జరగనున్నాయి.. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 10.30 గంటలకు ఎన్సీపీఏ గ్రౌండ్కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు..